రేవంత్ సర్కారు మొదలుపెట్టిన ప్రజాపాలనకు విశేష ఆదరణ లభిస్తోంది. కేవలం మూడురోజుల్లోనే 40.57 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి రోజున రాష్ట్రవ్యా ప్తంగా 7.46 7468 లక్షల దరఖాస్తులు వస్తే.. రెండో రోజున 8.12 లక్షలు వచ్చాయి. మూడో రోజున ఏకంగా 18.29 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇలా దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే.. వీటిలో చాలా మంది రేషన్ కార్డు లేని వారే. ప్రభుత్వం అన్నింటికీ రేషన్ కార్డును ప్రామాణికం చేసింది. చాలా మందికి ఆ కార్డు లేకపోవడంతో.. అయోమయంలో పడ్డారు. అయినప్పటికీ అభయ హస్తం పథకం కింద దరఖాస్తు చేస్తూ, రేషన్ కార్డు లేదని అందులో పొరుస్తున్నారు. లేదా ఓ కాగితంపై రాసి ఇస్తున్నారు. అధికారులు వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు కానీ.. ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
జనం నుంచి నిరసనలు రాకుండా తీసుకుంటున్నారు కానీ వాటిని పక్కన పెడుతున్నారని, అందుకే అభయహస్తం తరహాలో రేషన్కార్డుకు రశీదు ఇవ్వడం లేదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అలాగే ఎన్నో సందేహాలకు అధికారులూ స్పష్టంగా సమాధానం చెప్పకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ముందుగా రేషన్ కార్డుల సంగతి తేల్చి.. ఆ తర్వాతే ఆరు గ్యారెంటీల దరఖాస్తులపై స్పందించాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులు లేని మెజార్టీ దరఖాస్తుదారులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటూ.. మరోవైపు విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని, ఎనిమిది తర్వాత క్లారిటీ వస్తుందని ప్రభుత్వం పెద్దలు ప్రకటిస్తుండడం గందరగోళానికి గురి చేస్తుంది. అలాగైతే అభయహస్తం దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు కోసం తీసుకుంటున్న వాటిని పరిగణనలోకి తీసుకోరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే ఉదాహరణకు గ్రేటర్లో మెజార్టీ ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తుంటారు. వారిలో కొందరికి ఇక్కడి చిరునామాతో ఆధార్, రేషన్కార్డులుంటే.. ఇంకొందరికి సొంతూరి చిరునామాల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు సంక్షేమ పథకాల కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సిలిండర్ నగరంలో ఉన్న నేపథ్యంలో ఊర్లో దరఖాస్తు చేస్తే.. రూ.500 రాయితీ వర్తిస్తుందా..? లేదా..? ఇక్కడ దరఖాస్తు చేసిన పక్షంలో రైతు భరోసా కింద గ్రామంలోని వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం అందుతుందా..? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో ఫథకం కోసం ఒక్కో చోట దరఖాస్తు చేయొచ్చా..? అలా చేసిన పక్షంలో అప్లికేషన్ ఆమోదిస్తారా..? తిరస్కరిస్తారా..? అద్దె ఇళ్లలో ఉండే వారికి గృహజ్యోతి వర్తించేందుకు ఏం చేయాలి..? అన్న ప్రశ్నలను అధికారుల వద్ద చెబుతున్నారు. అధికారులు కూడా దీనిపై సమాధానాలు ఇవ్వడం లేదు. ‘నా రేషన్ కార్డులో మా ఊరి చిరునామా ఉంది. గ్యాస్ సిలిండర్ ఇక్కడ తీసుకున్నా. రాయితీ కోసం నేను ఎక్కడ దరఖాస్తు చేయాలి..?’ ‘నా రేషన్కార్డు, ఆధార్కార్డు నగరంలోని అడ్ర్సతో ఉన్నాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల లబ్ధికి ఇక్కడ దరఖాస్తు చేస్తా. రైతు భరోసా కోసం ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి..?’
‘నేను అద్దెకుంటా.. నెలకు రూ.500-700 విద్యుత్ బిల్లు వస్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేయాలి. అద్దెకుండే నా పేరుపై మీటర్ ఉండదు కదా. పథకంలో లబ్ధి కోసం నేనేం చేయాలి..?’ వంటి వాటికి సమాధానాలు దొరకడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ