టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకం సాధించాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో గురువారం సాయంత్రం జరిగిన ఫైనల్ లో రష్యా ఒలింపిక్ కమిటీకి (ఆర్ఓసీ) చెందిన జావుర్ యుగేవ్ తో రవి దహియా హోరాహోరిగా పోరాడాడు. అయితే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జావుర్ యుగేవ్ రెండు పీరియడ్స్ లోనూ ఆధిపత్యం చూపించి 7-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో రవి దహియా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ ఫైనల్ లో రెజ్లర్ సుశీల్ కుమార్ రజతం సాధించగా, 9 సంవత్సరాల అనంతరం టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో రవి దహియా రజతం సాధించి ప్రత్యేక గుర్తింపు సాధించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య ఐదుకు (రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు) చేరుకుంది.
మరోవైపు రవి దహియా కంటే ముందు ఒలింపిక్స్ లో నలుగురు భారత రెజ్లర్లు పతకాలు సాధించారు. 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో కెడి జాదవ్ (కాంస్యం), సుశీల్ కుమార్ 2008 బీజింగ్ లో (కాంస్యం), 2012 లండన్ లో (రజతం), 2012 లండన్ లో యోగేశ్వర్ దత్ (కాంస్యం) మరియు 2016 రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ (కాంస్యం) సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ