ప్రజలకు ఆరోగ్య సేవల అమలును వేగవంతం చేయడానికి, బ్లాక్ స్థాయి నుండి ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం కేంద్ర నిధులను సకాలంలో వినియోగించుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కోరారు. మంగళవారం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో జాతీయ ఆరోగ్య మిషన్, ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ-2 కింద వివిధ ప్రాజెక్టులు, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లతో సహా వివిధ పథకాల అమలును వర్చువల్గా సమీక్ష నిర్వహించారు.
దేశవ్యాప్తంగా బహుళ-స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాల నెట్వర్క్ను సృష్టించడం, విస్తరించడం మరియు బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సహకార మరియు సహకార సమాఖ్య స్ఫూర్తితో పని చేస్తోందని అన్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ కింద ప్రికాషన్ డోస్ పంపిణీ పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు.
ప్రికాషన్ డోస్ కవరేజీని వేగవంతం చేయాలి:
జూలై 15న ప్రారంభమై 75 రోజుల పాటు అనగా సెప్టెంబర్ 30, 2022 వరకు జరగనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ కింద 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో ఉచిత ప్రికాషన్ డోస్ కవరేజీని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి మాండవియ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను గట్టిగా కోరారు. 2వ డోస్ తీసుకున్న తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తి చేసిన 18 ఏళ్లు పైబడిన వ్యక్తులందరూ ప్రభుత్వ టీకా కేంద్రాలలో ఉచిత ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. అలాగే కొర్బేవాక్స్ వ్యాక్సిన్ యొక్క హెటెరోలాగస్ ప్రికాషన్ డోస్ లభ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పాఠశాలలు/కళాశాలలు, మతపరమైన యాత్రా మార్గాలు, మతపరమైన ప్రదేశాలు మొదలైన బహిరంగ ప్రదేశాలలో వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహించడం ద్వారా అర్హులైన లబ్ధిదారులలో ప్రికాషన్ డోస్ పంపిణీ పెంచవచ్చన్నారు. వ్యాక్సిన్ల గడువు ముగియకుండా ఉండేందుకు అన్ని వ్యాక్సిన్ డోసులు (ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్) సూత్రం ఆధారంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యాక్సిన్లు విలువైన జాతీయ వనరులని, రాష్ట్రాలు ఖచ్చితమైన ప్రణాళిక మరియు క్రమ సమీక్ష ద్వారా ఒక్క డోస్ కూడా గడువు ముగియకుండా చూసుకోవాల అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY