ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన నేపథ్యంలో జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న రెండు రోజులపాటుగా దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) పిలుపునిచ్చింది. తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎఫ్బీయూ జనవరి 13న ఐబీఏతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. బ్యాంకు ఉద్యోగుల జీతం పెంచాలని 2017 నుంచి డిమాండ్ చేస్తున్నామని, అప్పటినుంచి సుమారు 20 సార్లు చర్చలు జరిపినా 13శాతం కంటే ఎక్కువ పెంచబోమని చెప్పడం సరికాదని బ్యాంక్ యూనియన్లు మండిపడుతున్నాయి. జనవరి 31న ఆర్థిక సర్వే విడుదల చేస్తుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ తేదీల్లోనే యుఎఫ్బీయూ సమ్మెకు దిగుతుండడంతో ఈ సమ్మెకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా రెండు రోజులు పాటు బ్యాంకులు మూసివేయన్నారు. దీంతో ఏటీఎంల పనితీరు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. ఐబీఏ తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రకటించిన రెండ్రోజుల సమ్మెతో పాటుగా మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు సమ్మె చేస్తామని యుఎఫ్బీయూ హెచ్చరించింది. అప్పటికీ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యుఎఫ్బీయూ సభ్యులు పేర్కొన్నారు.
[subscribe]