జనవరి 31, శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, ఇతర కేంద్ర మంత్రులతో పాటుగా కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ్, టిఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే కేశవరావు, వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది.
అఖిలపక్ష సమావేశం అనంతరం కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడానికి కొన్ని నెలలుగా నిర్బంధంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరాయని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించబడినందున, ప్రతిపక్షాలు ఆ చట్టాన్ని వ్యతిరేకించే విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మన దేశం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశాల్లో చర్చించాలన్నారని మంత్రి ప్రహ్లాద్ జోషీ కోరారు.
[subscribe]