జనసేన పార్టీ కీలక నాయకుడు, సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జనవరి 30, గురువారం నాడు రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు పంపించారు. ”పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంటన నడిచిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకి నా కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారందరికీ మరియు మీకు, మీ కుటుంబసభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు” అని రాజీనామా లేఖలో జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేనపార్టీ తరుపున జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ స్పందించారు. పార్టీకి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ” వి.వి లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలులాంటివి ఏమీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు” అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
[subscribe]