ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 202 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా, బీజేపీ ఇప్పటికే ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. ఈ ఘనవిజయంతో బీజేపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టనుంది. ఇప్పటివరకు కౌంటింగ్ వివరాల ప్రకారం బీజేపీ 250 స్థానాల్లో విజయం సాధించగా, 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. సమాజ్ వాదీ పార్టీ దాని మిత్రపక్షాలు 118 స్థానాల్లో విజయం సాధించగా, 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకుంది.
మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో 37 ఏళ్ల తరువాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డ్ సృష్టించారు. 1985 లో ఎన్డీ తివారీ తర్వాత ఇప్పటివరకు మరెవరూ వెంటనే రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకోలేక పోయారు. గోరఖ్పూర్ అర్బన్ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్టీ ఘన విజయంపై యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “విధానసభ ఎన్నికలు-2022లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఈ విజయం ప్రజాస్వామిక విలువలపై ప్రజల్లో విశ్వాసాన్ని బలపరుస్తుంది” అని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (403): (గెలుపు)
బీజేపీ+: 268 స్థానాల్లో గెలుపు, 6 స్థానాల్లో ఆధిక్యం
- బీజేపీ: 250
- అప్నాదళ్ (సోనియల్): 12
- నిషద్ : 6
సమాజ్ వాదీ పార్టీ+: 118 స్థానాల్లో గెలుపు, 6 స్థానాల్లో ఆధిక్యం
- సమాజ్ వాదీ పార్టీ: 104
- ఆర్ఎల్డీ: 8
- సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ: 6
- అప్నాదళ్ (కమెరవాడి ): 0
–> కాంగ్రెస్: 2 స్థానాల్లో గెలుపు
–> బీఎస్పీ : 1 స్థానంలో గెలుపు
–> ఇతరులు: 2 స్థానాల్లో గెలుపు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. కాగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 75 జిల్లాల్లోని 403 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 750 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు, కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం, ఆప్ సహా పలు పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే ఫలితాల్లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ కూటమి మధ్యనే పోటీ నెలకుంది. ప్రస్తుత ఫలితాల సరళిని గమనిస్తే ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ మళ్ళీ అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తుంది. కాగా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ