పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన విజయం సాధించింది. పంజాబ్ లో ఆప్ ప్రస్థానం 8 ఏళ్ల క్రితం ప్రారంభమవగా, కొన్ని విజయాలు, పరాజయాలతో ముందుకు సాగుతుంది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలకు తారుమారు చేస్తూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠం కూడా దక్కించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది.
కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలను తలదన్ని అధికారం దక్కించుకోవడంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రణాళికలపై మరోసారి చర్చ జరుగుతుంది. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 59 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఆప్ 92 స్థానాల్లో ఘన విజయాన్ని నమోదు చేసి, పూర్తి మెజారిటీతో తొలిసారి అధికారాన్ని చేప్పట్టబోతోంది. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై భగవంత్ సింగ్ మాన్ 58 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇక కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో, ఎస్ఏడీ+ 3 స్థానాల్లో, బీజేపీ+ రెండు స్థానాల్లో, బీఎస్పీ ఒక స్థానంలో, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చమ్కౌర్ సాహిబ్ మరియు బదౌర్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా రెండు చోట్ల పరాజయం పొందారు. అలాగే అమృత్సర్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసిన పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజోత్ సింగ్ సిద్ధూ ఓడిపోయారు. ఇక పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి, బీజేపీతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో అమరీందర్ సింగ్ కూడా పాటియాలా స్థానం ఓటమి పాలయ్యారు. జలాలాబాద్ నుంచి పోటీ చేసిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కూడా పరాజయం పాలయ్యారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (117) : (గెలుపు)
- ఆప్ : 92
- కాంగ్రెస్ : 18
- ఎస్ఏడీ : 3
- బీజేపీ : 2
- బీఎస్పీ : 1
- ఇండిపెండెంట్ : 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ