ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి మే 31న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని చంపావత్, ఒడిశాలో బ్రజరాజ్ నగర్ లో, కేరళలోని త్రిక్కాకర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగగా, ఆ స్థానాల్లో నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఉత్తరాఖండ్ లోని చంపావత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి నిర్మలా గహ్తోరిపై పుష్కర్ సింగ్ ధామి 55,025 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీకి 47 స్థానాల్లో విజయంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజారిటీ సాధించింది. కాగా ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరోసారి పుష్కర్ సింగ్ ధామికే ముఖ్యమంత్రిగా బీజేపీ అవకాశం ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా పదవీలో కొనసాగాలంటే ఆయన ఆరు నెలల్లోగా మళ్లీ అసెంబ్లీకి ఎన్నికావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంపావత్ లో బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గేహతోరి రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో పుష్కర్ సింగ్ ధామి పోటీ చేశారు. ఈ కీలక ఉపఎన్నికలో పుష్కర్ సింగ్ ధామి ఘనవిజయం సాధించడంతో ఆయన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
ఇక ఒడిశాలో బ్రజరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి రాధారాణి పాండేపై బీజేడీ (బిజూ జనతా దళ్) అభ్యర్ధి అలకా మొహంతి 22,070 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అలాగే కేరళలోని త్రిక్కాకర అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్/యూడీఎఫ్ అభ్యర్ధి ఉమా థామస్ సమీప సిపిఎం/ఎల్డీఎఫ్ అభ్యర్ధి డా.జో జోసఫ్ పై 24,265 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF