కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మద్యం షాపులను కూడా మూసివేశారు. అయితే లాక్డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం పంపిణీకి అనుమతిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏప్రిల్ 8, బుధవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం అమ్మకంపై ఎలాంటి నిషేధం లేకపోవడం వలన ఇంటి వద్దకు (హోమ్ డెలివరీ) మద్యం పంపిణీ చేయడానికి ఒక నిబంధన ఉందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఆదాయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెంగాల్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇకపై ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చారు. స్థానిక పోలీసు స్టేషన్ల ద్వారా కోల్కతా పోలీసులు మద్యం దుకాణం దారులకు డెలివరీ పాస్లు జారీ చేస్తారని ఎక్సైజ్ విభాగం తెలిపింది. ఈ పాసులను పొందటానికి మద్యం దుకాణ యజమానులు ఆయా ప్రాంతాల పరిధిలోని స్థానిక పోలీసు స్టేషన్లను సంప్రదించాలి. మద్యం వినియోగదారులు తమ సమీపంలోని మద్యం షాపులలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఫోన్ ద్వారా ఆర్డర్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం దుకాణదారులు ఆ రోజు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల మధ్య ఆర్డర్లకు అనుగుణంగా మద్యాన్ని పంపిణీ చేయనున్నారు.