ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఇంకో వారం, పదిహేను రోజులు పెంచినా ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఓ వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్ మండలాల్లోని మిట్టపల్లి, పొన్నాల, ఇర్కోడ్, చిన్నగుండవెళ్లి, రాఘవాపూర్ గ్రామాల్లో ఏప్రిల్ 8, బుధవారం ఉదయం పర్యటించి వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, గ్రామాగ్రామాన సెంటర్లు పెట్టి, మీ వద్దకే వచ్చి ధాన్యం కొంటున్నామని, రైతులు కూడా సహకరించాలని, పంట కోసిన తరువాత బాగా ఆరబెట్టిన తర్వాత మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు రావాలని రైతులను కోరారు. అన్నీ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర అందించి కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 5 కోట్లన్నర గన్నీ బ్యాగులు ఉన్నాయని, మిగతా సగం బ్యాగులు కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులు కూడా గతంలోని పాత గన్నీ బ్యాగులు ఉంటే తీసుకురావాలని కోరారు. ఈ మాసంలో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, రైతులు టార్ఫలి న్ కవర్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. టార్ఫలిన్ కవర్లు లేకపోతే ఒక రైతుకు, మరో రైతుతో కలిసి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని చెప్పారు. జిల్లాకు అవసరమైన150 ప్యాడీ క్లినర్స్ పంజాబ్ రాష్ట్రం నుంచి సిద్దిపేటకు తెప్పిస్తున్నామని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పుడొక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో మన దేశంలో కరోనా అదుపులో ఉందని చెప్పారు. కరోనాకు మందు లేదు. మన ఇంట్లో మనం ఉంటూ ప్రభుత్వానికి సహకరించడమే కరోనాకు మందు అంటూ రైతులకు అవగాహన కల్పించారు. అగ్రరాజ్యాలైన అమెరికా మరియు ఇటలీ వంటి దేశాలు కరోనాతో విలవిలలాడుతున్నాయని, కేవలం 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపు చేయలేక పోతున్నదని, అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా ఆదుపు తప్పితే పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించాలని అన్నారు. కరోనాకు కులం, మతం లేదని, అందరికి వస్తుందని, బ్రిటన్ ప్రధానికే కరోనా సోకి ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏంపీపీ శ్రీదేవి, జెడ్పిటీసీ శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.