ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్దమవుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి 26 వరకు ముంబయిలో జరగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023 కోసం ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్ వేలం ప్రక్రియ ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు వేలం కోసం ముందుగా మొత్తం 1525 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా వేలంలో ఉండే 409 మంది ఉమెన్ క్రికెటర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ 409 మంది ప్లేయర్స్ లో 246 మంది భారత ఉమెన్ క్రికెటర్లు, మరియు 163 మంది విదేశీ, అలాగే 8 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఉమెన్ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో 202 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్డ్ ప్లేయర్లు), 199 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్లు) మరియు ఎనిమిది మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. మొత్తం ఐదు జట్లతో గరిష్టంగా 90 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి, 30 మంది విదేశీ ప్లేయర్స్ కు స్లాట్ చేయబడ్డాయి.
రూ.50 లక్షలు అత్యధిక రిజర్వ్ ధర కాగా, అందులో 24 మంది ప్లేయర్స్ ఎంపిక చేయబడ్డారు. రూ.50 లక్షలు అత్యధిక రిజర్వ్ ధర కేటగిరిలో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ మరియు అండర్-19 టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ షఫాలీ వర్మ వంటి భారత్ ప్లేయర్స్ ఉన్నారు. ఎల్లీస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ డివైన్, డియాండ్రా డాటిన్ వంటి వారితో సహా 13 మంది విదేశీ ప్లేయర్స్ కూడా వేలంలో రూ.50 లక్షల రిజర్వ్ ధర కేటగిలో ఉన్నారు. ఇక 40 లక్షల కనీస/బేస్ ధరతో 30 మంది ప్లేయర్స్ వేలం జాబితాలో ఉన్నారు. మరోవైపు డబ్ల్యూపీఎల్ లో మొత్తం 22 మ్యాచ్లు ఆడనుండగా, ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం మరియు డీవై పాటిల్ స్టేడియంలోనే అన్ని మ్యాచ్ లు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE