టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ను నోయిడా పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియోను ఎడిట్ చేసి టీవిలో ప్రసారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఆ టీవీ యాజమాన్యం ఆ వీడియోను ప్రసారం చేసినందుకు క్షమాపణలు కూడా చెప్పింది. ఇక దీనికి సంబంధించి యాంకర్ రోహిత్ను చత్తీస్ఘడ్ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా.. ఆయన యూపీ పోలీసుల సహాయం కోరినట్లు తెలుస్తోంది. దీంతో చత్తీస్ఘడ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి ముందే నోయిడా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కాగా రాహుల్ గాంధీ నియోజవకర్గం వయనాడ్లో ఆయన ఆఫీసుపై ఇటీవల కొందరు యువకులు దాడి చేయగా ఆ ఘటనను ఖండిస్తూ రాహుల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. వారు చిన్న పిల్లలని, ఆవేశంలో తెలియక బాధ్యతారహితంగా ప్రవర్తించారని, కానీ వారిని వదిలి పెట్టాలని రాహుల్ వీడియోలో కోరారు. అయితే ఈ వీడియోను జీ న్యూస్ ఛానల్ ఫ్యాబ్రికేట్ చేసి ప్రసారం చేసింది. ఇటీవల ఉయద్పూర్లో జరిగిన టైలర్ హత్యా ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ ఆ వ్యాఖ్యలను చేసినట్లుగా నకిలీ వీడియోను చూపించింది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం తెలపడంతో జీ న్యూస్ క్షమాపణలు చెప్పింది. అయితే దీనిని సీరియస్గా తీసుకున్న చత్తీస్ఘడ్ పోలీసులు మంగళవారం యాంకర్ రోహిత్ను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆ సమయంలో నోయిడా పోలీసులు ఎంటరై అతడిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ