వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ల టి-20ల సిరీస్ ను, భారతజట్టు 3-0 తో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి టి-20 మ్యాచ్లో కూడ వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన వెస్టిండీస్ జట్టు మొదటిగా బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే 14 పరుగులకు వెస్టిండీస్ మూడు వికెట్లను కోల్పోయిన తరుణంలో, నాలుగోస్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన కీరన్ పోలార్డ్ 48 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. చివర్లో పావెల్ కూడ 32 పరుగులతో రాణించడంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లకి ఆరు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు, నవదీప్ సైనీ 2 వికెట్లు పడగొట్టారు.
తరువాత బ్యాటింగ్ వచ్చిన భారత్ జట్టు 10 పరుగుల వద్దే శిఖర్ ధావన్(3) వికెట్ కోల్పోయింది, తరువాత 27 పరుగులవద్ద లోకేష్ రాహుల్ కూడ 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్ చక్కదిద్దారు. మొదట నిదానంగా ఆడినా కూడ, కుదురుకున్నాక వారి శైలిలో ఆడారు. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి అవుట్ అవ్వగా, రిషబ్ పంత్ సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. రిషబ్ పంత్ 65 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో థామస్ రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు క్రునాల్ పాండ్యా అందుకోగా, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దీపక్ చాహర్ అందుకున్నాడు.