ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్-2020 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షను నిర్వహించే జెఎన్టియూ-కాకినాడ ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదలతో ఎంసెట్ పరీక్ష ప్రక్రియ మొదలు కానుంది. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంసెట్ రాయదలచుకున్న అభ్యర్థులు కేవలం ఒక స్ట్రీమ్కు అయితే రూ.500, రెండు స్ట్రీమ్లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అలాగే రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 4వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఫిబ్రవరి 10, సోమవారం నాడు జరిగిన ఎంసెట్-సెట్ కమిటీ సమావేశంలో ఎంసెట్-2020 నిర్వహణ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఎంసెట్- 2020 కమిటీ చైర్మన్ రామలింగరాజు, ఎంసెట్-2020 కమిటీ కన్వీనర్ వి.రవీంద్ర పాల్గొన్నారు. ఈ సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కానుంది. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకునేలా ఎంసెట్ దరఖాస్తులోనే కొన్ని కాలమ్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఎంసెట్-2020 పూర్తి షెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2020
- దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28, 2020
- దరఖాస్తు చేసుకునేందుకు ముగింపు: మార్చి 27, 2020
- రూ.500 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 4, 2020
- రూ.1000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 9, 2020
- రూ.5000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 14, 2020
- రూ.10,000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 19, 2020
- అడ్మిట్ కార్డు విడుదల: ఏప్రిల్ 16, 2020
- ఎంసెట్-ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 20, 2020 నుండి ఏప్రిల్ 23, 2020 వరకు
- ఎంసెట్-అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 23 మరియు 24, 2020
- ఇంజనీరింగ్ స్ట్రీమ్ మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 22 మరియు 23, 2020
- ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రాధమిక కీ ప్రకటన: ఏప్రిల్ 23, 2020
- అగ్రికల్చర్ స్ట్రీమ్ ప్రాధమిక కీ ప్రకటన: ఏప్రిల్ 24, 2020
- ఫలితాల ప్రకటన తేదీ: మే 5, 2020.
[subscribe]