వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీలను భారత జట్టు గెలుచుకుంటుందని పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నీలను గెలిపించే సత్తా, సామర్థ్యం కోహ్లికి ఉందని చెప్పాడు. కోహ్లీ సారధ్యంలో ఇప్పటికే టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ భారత్ జట్టు అత్యున్నత స్థాయిలో నిలిచిందని కొనియాడాడు. ఈ టోర్నీల్లో మిగిలిన జట్లన్నీ భారత్ నే ప్రత్యర్థిగా భావించి, ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయని అన్నారు. అలాగే భారత్తో జరిగే మ్యాచ్ తమకు కీలకమని మిగతా జట్లు భావిస్తాయని చెప్పారు.
15 ఏళ్ల క్రితం లారా ఇంగ్లండ్పై 400 పరుగులు సాధించి నాటౌట్గా నిలవగా, టెస్ట్ క్రికెట్లో ఇప్పటికీ అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తన 400 పరుగుల రికార్డును అధిగమించే ఆటగాళ్ల గురించి లారా తన మనసులోని మాట బయటపెట్టాడు. టెస్టుల్లో తన 400 రికార్డును సాధించగల సత్తా ముగ్గురి ఆటగాళ్లకే ఉందని చెప్పాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్, భారత్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అవకాశం ఉందన్నాడు. అటాకింగ్ ఆటతో కోహ్లీ, అలాగే తనదైన రోజు రోహిత్ ఈ రికార్డును అందుకోగలడని అన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే స్టీవ్ స్మిత్ అద్భుతమైన బ్యాట్స్మన్ అయినప్పటికీ, తన రికార్డును చేరుకోలేడని బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు.