విజ్డెన్ దశాబ్దపు టీ20 ఇంటర్నేషనల్స్ జట్టులో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 క్రికెట్ లో పలు సంచలనాలకు మారుపేరైన భారత్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మాత్రం చోటు దక్కలేదు. మరోవైపు ఆశ్చర్యంగా ప్రస్తుత ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కు నాయకత్వం వహిస్తున్న ఆరోన్ ఫించ్ను విజ్డెన్ దశాబ్దపు టీ20 జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి హిట్టర్లు షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్వెల్కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్, డేవిడ్ విల్లే, న్యూజిలాండ్ నుంచి కొలిన్ మన్రో, శ్రీలంక నుంచి పేస్ బౌలర్ లసిత్ మలింగ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్, మహ్మద్ నబి చోటు దక్కించుకున్నారు.
విజ్డెన్ ప్రకటించిన టెస్ట్ మరియు వన్డే జట్టులో కూడా విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. అలాగే ఈ దశాబ్దపు ఐదుగురు క్రికెటర్ల విజ్డెన్ జాబితాలో స్టీవ్ స్మిత్, డేల్ స్టెయిన్, ఎబి డివిలియర్స్ మరియు ఎల్లిస్ పెర్రీలతోపాటుగా కోహ్లీ స్థానం సంపాదించాడు. ‘అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉందని, అతడి సగటు 53 ఈ దశాబ్దంలోనే అత్యుత్తమని’ విజ్డెన్ పేర్కొంది. అలాగే డేల్ స్టెయిన్ తర్వాత 6.71 ఎకానమీ రేటుతో పేస్ బౌలర్లలో బుమ్రా రెండో అత్యుత్తముగా నిలిచాడని చెప్పారు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.