రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వైద్యాధికారులు, నిపుణులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి ఎక్కువ స్థాయిలో కరోనా సోకుతుందని అసత్య ప్రచారం జరుగుతుందని వారు తెలిపారు. “వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదనే ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందించే వారికి కూడా వైరస్ సోకుతున్నది. ఇది చాలా సహజం. కేవలం తెలంగాణలోనే జరగడం లేదని” అన్నారు.
“ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి కరోనా వైరస్ సోకింది. ఐసిఎంఆర్ అంచనా ప్రకారమే భారతదేశంలో 10వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. అమెరికాలో 68 వేల మంది వైద్య సిబ్బందికి సోకింది. బ్రిటన్ లో వైరస్ సోకిన వారిలో 15 శాతం మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇదే తరహాలో తెలంగాణలో ఇప్పటి వరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. తెలంగాణలో వైరస్ సోకిన వైద్య సిబ్బందిలో ఎవరూ సీరియస్ గా లేరు. వారు మా తోటి వైద్య సిబ్బంది. వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం. వారంతా కోలుకుంటున్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నట్లు దుష్ప్రచారం చేయడం బాధాకరమని” వైద్యాధికారులు, నిపుణులు సీఎం కేసీఆర్ కు వివరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu