వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లో చేరికపై మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించారు. కాంగ్రెస్ షరతులకు ఆమోదం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధదమయ్యారు. కానీ, అక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. షర్మిల పార్టీలో ప్రాధాన్యతపై కొందరు కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నారు. దీంతో, షర్మిలకు కాంగ్రెస్ రాజకీయం ఏంటో బోధపడుతోంది.
షర్మిల రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటంతోపాటుగా అధికారికంగా అన్నింటిపై పార్టీ హైకమాండ్తో ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరిపారు. ప్రాథమికంగా ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్తో షర్మిల చర్చలు పూర్తి చేశారు. అంతిమంగా రాహుల్తో సమావేశం..ఆ వెంటనే సోనియా సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావించారు. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశయ్యారు. రాహుల్తో సమావేశం కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇదే సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది.
షర్మిల కాంగ్రెస్లో చేరటం.. తెలంగాణ నుంచి పని చేయటం టీపీసీసీలోని ముఖ్య నేతలకు ఇష్టం లేదని తెలుస్తోంది. కొందరు నేతలు మినహా మెజార్టీ నేతలు షర్మిల కాంగ్రెస్లోకి రావటం, తెలంగాణలో పని చేయటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్తో పాటుగా పలువురు బలహీన వర్గాలకు చెందిన నేతలు షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారు. పార్టీని విలీనం చేసి తెలంగాణలో కాకుండా ఏపీలో పని చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నట్లు సమాచారం. దీంతో, పార్టీ విలీనం కోసం అన్నింటికి సిద్దమై ఢిల్లీ వెళ్లిన షర్మిలకు పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన సమాచారం తెలుసుకొని షాక్ అయ్యారు. దీంతో, హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. తాను అన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తానని ఆ పార్టీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు.
షర్మిల పార్టీలో చేరటం ద్వారా ఏపీలోనూ కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. అయితే, షర్మిల తెలంగాణ నుంచే పోటీ చేస్తానని చెప్పటం, పార్టీలో ప్రాధాన్యత ఇస్తానని హైకమాండ్ హామీ ఇవ్వటం టీపీసీసీ నాయకత్వానికి రుచించటం లేదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరినా, టీపీసీసీ నాయకత్వం ఏ మేర సహకరిస్తుందనేది సందేహంగానే కనిపిస్తోంది. అదే సమయంలో షర్మిల తెలంగాణ అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇవన్నీ టీపీసీసీకి నచ్చటం లేదు. షర్మిల రాకను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు స్వాగతిస్తున్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిని తప్పు బట్టారు. షర్మిల రాకతో పార్టీకి మేలు జరుగుతుందని వాదిస్తున్నారు. వరుస పరిణామాలను గమనిస్తున్న షర్మిల..అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE