ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9, గురువారం నాడు చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పిల్లల చదువు తల్లికి భారం కాకూడదని, పేద తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. పిల్లలకు మనమిచ్చే నిజమైన ఆస్తి చదువే అని సీఎం వైఎస్ జగన్ పేర్కోన్నారు. పిల్లలను బడికి పంపుతున్న ప్రతి పేదింటి తల్లికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా 43 లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు జమచేస్తామని అన్నారు. అలాగే 81 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
అర్హత ఉండి కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదోతరగతి వరకే అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పినా, ఇంటర్ వరకు పొడిగించామని చెప్పారు. ఈ పథకం విధివిధానాల్లో పేర్కొన్న విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనకు ఈ ఏడాది మినహాయింపు ఇస్తున్నామని, వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే వచ్చే 2020-21 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని ప్రకటించారు. తర్వాత ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతిని పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అమ్మఒడి పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
[subscribe]