ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ముందుగా మార్చ్ 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నారు. అనంతరం మార్చ్ 23న మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకే దశలో జరుగుతాయి. ఇక మార్చ్ 27, 29వ తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికలను మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ రాజధాని గ్రామాల్లో మాత్రం ఎన్నికలు జరగడం లేదని పేర్కొన్నారు.
రాజధాని పరిధిలో కొన్ని గ్రామాలను ప్రత్యేక కార్పోరేషన్గా గుర్తించడంతో పాటు, మరి కొన్ని ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎర్రపాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో, అలాగే పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పోరేషన్గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
[subscribe]