పేద కుటుంబం నుంచి వచ్చి డిగ్రీ చదివినా.. ఉద్యోగం రాలేదు.. అందుకే బర్రెలు కాసుకుంటున్నా.. అంటూ సోషల్మీడియాలో పోస్ట్ పెట్టి ఫేమస్ అయిన బర్రెలక్క.. అలియాస్ కర్నె శిరీష. ఈ ఎన్నికల్లో కూబా బాగా పాపులర్ అయ్యారు. ఎన్నికలంటే సొమ్ములన్నవాళ్లకే అనే నానుడిని కొట్టి పారేసి బరిలో నిలబడ్డారు . ఆమె ఎన్నికల అఫిడవిట్, మేనిఫెస్టో అన్నీ సంచలనమే. సోషల్మీడియాలో వైరల్ అవున్నాయి. వాటి గురించి మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో నిలబడ్డ వారిలో దాదాపు అందరూ కోటీశ్వరులూ, బడా పారీశ్రామిక వేత్తలు. ఇతర రంగాల ప్రముఖులే. అఫిడవిట్లలోనే అధికారికంగా వందల కోట్ల ఆస్తులను చూపించారు. అలాంటి సమయంలో తన బ్యాంకు ఖాతాలో రూ.1,500, చేతిలో మరో రూ.5,000 ఉన్నాయంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క. దీంతో మొదటి నుంచీ ఆమె బాగా పాపులర్ అయ్యారు. రాష్ట్రంలోని వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ స్పందించారు. యానాం మాజీ ఎమ్మెల్యే ఆమె ఎన్నికల ఖర్చులకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పలువురు విద్యావేత్తలు, నిరుద్యోగులు, ప్రజలు ఆమె అండగా నిలిచారు.
ఇప్పటికే యూట్యూబ్ లో 1.66 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 5.97 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న శిరీష ఎన్నికల్లో నిలబడడంతో మరింత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, వారి తరఫున నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం పూర్తి చేశారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రచారం సాగిస్తున్న బర్రెలక్క తమ్ముడిపై దాడి జరగడం మరో సంచలనంగా మారింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము అమాయకులం సార్.. ఎన్నికల నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారు.. ప్రలోభాలకు గురి చేస్తున్నారు.. చివరకు తన తమ్ముడిపై దాడి చేశారు.. అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
దీంతో లాయర్ల బృందం ఆమెకు అండగా నిలిచింది. ఆమె తరఫున కోర్టులో వాదించి బర్రెలక్కకు గన్ మన్ తో సెక్యూరిటీ కల్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చేలా వాదించారు. దీంతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఆమెకు మద్దతు పెరుగుతోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పది కార్లతో ఆమెకు మద్దతుగా కొందరు ప్రొఫెసర్లు, నిరుద్యోగులు తరలి వెళ్లారు. దీంతో బర్రెలక్క ప్రచారంలో విజిల్ వేసుకుంటూ ప్రధాన పార్టీ అభ్యర్థులను సైతం హడలేలా చేస్తున్నారు. మాజీ జేడి లక్ష్మీనారాయణ స్వయంగా కొల్లాపూర్ వెళ్లి ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి జాతీయ నేతలు, బీఆర్ ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు బర్రెలక్క వంటి సామాన్య యువతి గురించి చెప్పుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఏదేమైనప్పటికీ బర్రెలక్క నయా రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు. చాలా మందిలో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతానంటున్న శిరీష గెలిచినా.. ఓడినా.. ఆమె గెలిచినట్లే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE