బేగంపేట లోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం నాడు రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఈ మీటింగ్ లో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం సెక్రటరీ పార్థసారధి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ గోడ పత్రికను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బతుకమ్మ పండగ ఆరంభ వేడుకలను ఈ నెల 28న వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో 10వేల మంది తో ఘనంగా ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. రాజ్ భవన్, అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహిస్తాం అని అన్నారు. చివరగా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంకు బండ్ వరకు ర్యాలీ ఉంటుందని, ముగింపు వేడుకలు ట్యాంకు బండ్ లో జరుగుతాయి అని తెలిపారు.
బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ప్రకృతిని పూజించే పండగని, గత ప్రభుత్వాలు ఈ పండుగను అంతగా పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను కాపాడుకోవాలని మహిళలు పెద్ద ఎత్తున కృషి చేసారని, జాగృతి ఆద్వర్యంలో బతుకమ్మ పండుగను దేశ విదేశాలలో కూడ జరుపుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి గత 5సంవత్సరాల నుంచి అధికారికంగా జరుపుకుంటున్నాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ పండుగ నిర్వహణ చేస్తున్నారు. మహిళలకు సెలవులు కూడ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పాటు అయిన ఐదు సంవత్సరాలు నుంచి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం, ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. డబ్బు తో సంబంధము లేకుండా అన్ని పండుగలను మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఘనంగా జరుపుతున్నాం అని పేర్కొన్నారు.
[subscribe]