ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి జారీ చేసినా ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 10, 2019న జారీచేసిన జీవో 38ను రద్దుచేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నిర్ణయంతో 4,5 విడతల్లో ఇవ్వాల్సిన రైతు రుణమాఫీ నిధులు రూ.7,959 కోట్ల చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందుగా, 4,5 విడతలకు మొత్తం పదిశాతం వడ్డీ కలిపి నిధుల విడుదలకు గత టీడీపీ ప్రభుత్వం జీవో 38ను జారీచేసింది. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా మరో జీవో విడుదల చేసింది. త్వరలో నవరత్నాల్లో భాగమైన వైఎస్ఆర్ రైతు భరోసా అనే పధకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్న తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పధకాన్ని కూడ ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే వైఎస్ఆర్ రైతు భరోసా పధకానికి అర్హులైన వారిని గుర్తించే పక్రియ దాదాపుగా పూర్తి అయింది.
[subscribe]