కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ రోజులో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర నేడు (నవంబర్ 1, మంగళవారం) హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. సాయంత్రం ఛార్మినార్ నుండి యాత్ర ప్రారంభం కాగా, ముందుగా రాహుల్ గాంధీ చార్మినార్ వద్ద జాతీయజెండా ఎగురవేశారు. గతంలో 1990, అక్టోబర్ 19న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చార్మినార్ నుంచే సద్భావనయాత్ర ప్రారంభించారు. దీంతో ప్రతి ఏడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయజెండా ఎగురవేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ 55వ రోజు భారత్ జోడో యాత్రకు ప్రాముఖ్యత సంతరించుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా పాల్గొంటున్నారు.
హైదరాబాద్ నగరంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చార్మినార్, ఆఫ్జల్ గంజ్, మోజంజహి మార్కెట్, గాంధీభవన్, రవీంద్ర భారతీ, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా నెక్లెక్ రోడ్ చేరుకోనుంది. అనంతరం నెక్లెస్రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఈ యాత్రలో రాహుల్ తో పాటుగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు. నెక్లెస్ రోడ్ లో సభ అనంతరం యాత్రకు విరామమిచ్చి బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నేడు రాహుల్ గాంధీ బస చేయనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలు నుండి రాత్రి 8 వరకు హైదరాబాద్లో సంబంధిత ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాహుల్ పాదయాత్ర జరిగే 3 కిలోమీటర్ల పరిధిలో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE