ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ‘మాన్ఘర్ ధామ్ కీ గౌరవ్ గాథా’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ గురువు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తపస్సు, త్యాగం, శౌర్యం, మన ఆదివాసీ ధైర్యహృదయాల త్యాగానికి చిహ్నమైన మాన్ఘర్ పుణ్య భూమిలో ఉండడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, మాన్ఘర్ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ ప్రజల భాగస్వామ్య వారసత్వం అని పేర్కొన్నారు. గోవింద్ గురు గిరిజనుల హక్కుల కోసం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని, అలాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు భారతదేశ సంప్రదాయం మరియు ఆదర్శాలకు ప్రతినిధి అని తెలిపారు. ఆదివాసీ, గిరిజన సమాజం లేకుండా భారతదేశ గతం, చరిత్ర, వర్తమానం మరియు భవిష్యత్తు ఎప్పటికీ సంపూర్ణం కాదని స్పష్టం చేశారు.
ఇక రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలు మాన్ఘర్ పూర్తి అభివృద్ధికి రోడ్మ్యాప్ ఏర్పాటు చేసుకుని కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. తామిద్దరం వేర్వేరు పార్టీలకు చెందినవారమైనా, ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేశామని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తాము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్ అని, ఇప్పుడు వేదికపై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరని ప్రధాని వెల్లడించారు. ఇక దీనికి ముందు సీఎం గెహ్లాట్ కూడా తన ప్రసంగంలో మోదీని ప్రశంసించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు గొప్ప గౌరవం లభిస్తోందని, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంనుంచి ఆయన వచ్చారని తెలిపారు. అందునా జాతిపిత గాంధీ పుట్టిన దేశానికి ఆయన ప్రధాని అని, అలాంటి దేశానికి ప్రధానిగా మోదీ తమ దేశం వచ్చినందుకు అక్కడి వారంతా గర్వపడుతుంటారని సీఎం గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE