సోమవారం తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.2,90,396 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణ బడ్జెట్పై విపక్ష బీజేపీ సభ్యులు మాత్రం పెదవి విరిచారు. కొన్ని వర్గాలను ఈ బడ్జెట్ విస్మరించిందని వారు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తమ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు రాజాసింగ్ మరియు రఘునందన్ రావులతో కలిసి అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద దీనిపై తమ స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్లో చెప్తున్నదానికి వాస్తవానికి పొంతన లేదని అన్నారు. రాష్ట్రంలో విద్యా వాలంటీర్లకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని, తెలంగాణాలోని అనేక పాఠశాలల్లో, వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిపై ప్రభుత్వం అసలు దృష్టి పెట్టలేదని విమర్శించారు.
ఇక బడ్జెట్లో విద్యారంగానికి సరైన కేటాయింపులు జరపలేదని చెప్పిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. పౌరుల ఆరోగ్యం ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యతని, అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందడం లేదని ఆరోపించారు. ఎన్నో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోతున్నాయని, దీనికి ప్రభుత్వం సరైన చెల్లింపులు చేయకపోవడమే కారణమని విమర్శించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సరిగా అందడం లేదని, చివరకు ప్రభుత్వాన్ని నమ్ముకుని పనిచేసే వివిధ డిపార్టుమెంట్ల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయక పనులు నిలిచి పోతున్నాయని మండిపడ్డారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE