బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి (సెప్టెంబర్ 12, సోమవారం) నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. నాలుగో విడత పాదయాత్ర సెప్టెంబర్ 12న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. కుత్బుల్లాపూర్ శ్రీ చిత్తారమ్మ దేవి దేవాలయం నుండి ఈ యాత్ర ప్రారంభమై ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు జరిగే ఈ యాత్ర మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ఇలా 8 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా వెళ్లనుండగా, బండి సంజయ్ 115.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు.
సోమవారం ఉదయం ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరారు. ఈ యాత్ర ప్రారంభానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో బండి సంజయ్, సునీల్ బన్సాల్, బీజేపీ నేతలు విజయ శాంతి, డా.జి.వివేక్ వెంకటస్వామి, తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది వాహనాలతో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాంలీలా మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభను నిర్వహించారు. ఈ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు హాజరయ్యారు.
తొలిరోజున శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో పూజలు, రాంలీలా మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభ అనంతరం బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. మేఘా ఐరన్ ఇండస్ట్రీస్, నర్సాపూర్ మెయిన్ రోడ్, జీడిమెట్ల బస్ స్టాప్, షపూర్ నగర్ క్రాస్ రోడ్స్, ఉషా ముళ్ళపూడి రోడ్ మీదుగా మహారాజా ఫంక్షన్ హాల్ వరకు తొలిరోజు యాత్ర సాగనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమంలో బండి సంజయ్ కూడా పాల్గొనుండంతో ఆ రోజున పాదయాత్ర ఉండదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY