కరోనా నియంత్రణపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఏప్రిల్ 15, బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మే 3 వరకు కేంద్రం ప్రకటించిన దేశ వ్యాప్త లాక్డౌన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన ప్రత్యేక మార్గదర్శకాలను ప్రకటించిందని, ఏప్రిల్ 20 తర్వాత వీటిని అమలులోకి తీసుకు వస్తామని రాజీవ్ గౌబా తెలిపారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి మరిన్ని సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి మరియు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రకటిస్తుందని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 165 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని, లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని నీలం సాహ్ని వివరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]