అసెంబ్లీ ఎన్నికల ప్రచార అంకం తుది దశకు చేరుకుంది. ప్రచారగడువు రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఉన్న కొద్దిపాటి సమయాన్ని సమర్థవంతంగా, ఎక్కువమందికి చేరేలా వినియోగించుకునేందుకు అన్ని పార్టీలూ ఏర్పాట్లు చేసుకున్నాయి. ఉధృతంగా బైకు, కారు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. భారీ స్థాయిలో జనసేకరణతో ర్యాలీలు నిర్వహిస్తూ.. బలప్రదర్శనకు దిగుతున్నాయి. రాష్ట్రంలో, నగరంలో, పర్యటిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు మిగిలిన సమయాన్ని ఎక్కువగా రోడ్షోలకు కేటాయించనున్నారు. రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కార్తీక కోటి దోపోత్సవంలోనూ ప్రధాని పాల్గొంటారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో సుదీర్ఘ రోడ్షోల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్ జంక్షన్ నుంచి ప్రారంభించి చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం ఆర్చి, నారాయణగూడ మార్కెట్, వైఎంసీఏ ఓల్డ్ పోలీస్స్టేషన్,కాచిగూడ వీర్సావర్కర్ విగ్రహం జంక్షన్ల వద్ద ప్రజల నుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆ మార్గాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులుతెలిపారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గ్రీన్ల్యాండ్స్, పంజగుట్ట, రాజ్భవన్, పీవీ విగ్రహం, నిరంకారీ భవన్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్రోటరీ, తెలుగుతల్లి జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరాపార్కు, అశోక్నగర్ మీదుగా ఆర్టీసీ క్రాస్రోడ్స్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్షో ప్రారంభం కానుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం సుడిగాలి పర్యటనలతో వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్షోల్లో పాల్గొననున్నారు.
ప్రచారం ముగియవస్తుండటంతో పాటు పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు,మద్యం, కానుకలు, తదితరాల పంపిణీకి అన్ని పార్టీలూ కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే నగర శివార్లలోని నియోజకవర్గాల్లో ఈ పంపిణీలు జోరందుకున్నాయి. కోర్సిటీలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తీరా పోలింగ్ ముందే అయితే తనిఖీలు, సోదాలతో ఇబ్బందులుంటాయని గ్రహించిన అభ్యర్థులు ముందస్తుగానే ఆయా ప్రాంతాల్లోని తమ అనుయాయులు, ముఖ్యనేతలు, సన్నిహిత సంబంధాలున్న వారివద్దకు నగదు చేర్చి, వెళ్లాల్సిన వారివద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో ఈ పాటికే తొలిదఫా పంపిణీ పూర్తిచేసి మరో దఫా హామీలిచ్చినట్లు చెబుతున్నారు. ఇదే అదనుగా చోటామోటా నేతలు తమ బస్తీల్లో తామెంత చెబితే అంతే అంటూ అభ్యర్థుల వద్ద బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. మందూ విందుల పార్టీలు నామినేషన్ల నాటి నుంచే సాగుతుండగా, ఇవి ఇంకా ఊపందుకోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఇంటింటికీ తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతూ బొట్టుపెట్టి కానుకలందజేస్తున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE