రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం (ఐఎంసీటి) ఏప్రిల్ 25, శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధానంగా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన 1500 పడకల ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రి (టిమ్స్) ను, హైదరాబాద్ నగరంలో వలస కూలీలు, నిరుపేదలకు ఉచితంగా అందించే భోజనాన్ని తయారు చేసే నార్సింగిలోని అతిపెద్ద కిచెన్ అక్షయపాత్రను ఈ ప్రతినిధి బృందం సందర్శించింది.
భారత ప్రభుత్వ జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గెడం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, కన్జ్యూమర్ ఎఫైర్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది తదితరులున్నారు. ఈ బృందం నేడు ఉదయం గచ్చిబౌలిలో ప్రతేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్ ఆసుపత్రిని తనిఖీ చేసింది.ఈ కోవిడ్ ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లపై పంచాయతీరాజ్ కమీషనర్ రఘునందన్ రావ్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ డా.జయరాం రెడ్డిలు ఈ బృందానికి వివరించారు. 2007లో జరిగిన ప్రపంచ మిలిటరీ క్రీడల సందర్బంగా నిర్మించిన ఈ 14 అంతస్తుల భవనంలో 1500 పడకల ఆసుపత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి, కింగ్ కోటి ఆసుపత్రులను పూర్తి స్థాయి కరోనా పాజిటివ్ కేసులకు సంబందించిన ఐసోలేషన్ ఆసుపత్రులుగా మార్చామని, ఆయా ఆసుపత్రుల్లో స్థాయిని మించి కేసులు నమోదైతే గచ్చిబౌలి ప్రత్యేక ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని వివరించారు. ఒక్క హైదరాబాద్ లోనే రెండు వేల పడకలు (బెడ్స్) వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్చడం జరిగిందని, కోవిడ్ నివారణ, చికిత్సలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుసరించే చేస్తున్నామని రఘునందన్ రావ్ తెలిపారు. కాగా ఈ ప్రతినిధి బృందం గచ్చిబౌలి ఆసుపత్రిలోని ఐ.సి.యూ, అత్యవసర వార్డులు, ఐసోలేషన్ వార్డులు, థియేటర్లు, స్టోర్ రూములన్నింటిని పరిశీలించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గ దర్శకాలను అనుసరించి వివిధ ప్రోటోకాల్ కమిటీల ఏర్పాటు చేశారా, కరోనా నివారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తదితర అంశాలపై ప్రశ్నించారు.
అనంతరం ఈ బృందం నార్సింగిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన వంటశాలను (మెయిన్ కిచెన్ ) పరిశీలించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ కేంద్రం ద్వారా ప్రతిరోజూ దాదాపు లక్షన్నర మందికి మధ్యాహ్నం, సాయంత్రం బోజనాలను అందిస్తున్నామని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటుచేసిన 150 అన్నపూర్ణ క్యాంటిన్ ల ద్వారా ఈ బోజనాలను అందిస్తున్నామని, కరోనా వ్యాధి అనంతరం ఈ అన్నపూర్ణ కేంద్రాలను 200 లకు పెంచారని తెలిపారు. దీనితో పాటు మొబైల్ వాహనం ద్వారా కూడా బోజనాలను అందచేస్తున్నామని పేర్కొన్నారు. భోజనాల నాణ్యత, హైజినిక్, ట్రాన్స్పోర్టేషన్, పంపిణీ తదితర విషయాలను కేంద్ర ప్రతినిధులు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జీహెఛ్ఎంసీ జోనల్ కమీషనర్ రవికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu