ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఆ అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామని అన్నారు. అధికారుల తప్పుడు సమాచారంపై ఈ రోజు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. రాజ్యాంగంపైనా, న్యాయస్థానాలపైనా సీఎం కేసీఆర్కు ఏమాత్రం గౌరవం ఉన్నా కూడ శాసనసభ, హైకోర్టు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద సమస్యగా మారాయని అన్నారు.
సుమారు 50 వేల మంది కార్మికులున్న ఆర్టీసీ సంస్థకు సంబంధించి ఇన్ని రోజూలుగా సమ్మె జరుగుతున్నా పరిష్కారమార్గం వైపు తీసుకెళ్లకుండా, ఆ సమ్మెను ఆసరాగా చేసుకుని ఆర్టీసీకి సంబంధించిన ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టారని ఆయన ఆరోపించారు. 5100 రూట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, రాష్ట్రంలో రవాణా వ్యవస్థను వారి దయాదాక్షణ్యాలపై ఉంచే కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరంగా ఉందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఆస్తులు సృష్టించి ఇవ్వాలని, అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు సృష్టించిన ఆస్తులను కూడ అమ్మకానికి పెడుతోందని భట్టి విక్రమార్క విమర్శించారు. నవంబర్ 9, శనివారం నాడు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ట్యాంక్ బండ్ పై నిర్వహించే మిలియన్ మార్చ్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
[subscribe]