రాష్ట్రంలోని అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాధ బాలికల ఆశ్రమాన్ని, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వసతి గదులు, తరగతి గదులు, కళావేదిక అన్ని తిరిగి నిశితంగా పరిశీలించారు. ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సక్రమంగా అందిస్తున్నారా? అని మంత్రి బాలికలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బాలికలకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డైరెక్టర్ శైలజలు బాలికలతో కలిసి భోజనం చేశారు. బాలికల కోసం అమలు చేస్తున్న మెనూ పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ, సిబ్బందిని అభినందించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అనాధ పిల్లలకు, కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి వారిని ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయం అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అనాధ పిల్లలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పించడానికి, ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమో గుర్తించడానికి, సమస్యలపై అధ్యయనం చేయడానికి సీఎం కేసీఆర్ 8 మంది మంత్రులతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అనాధ పిల్లలకు ప్రభుత్వం తల్లిదండ్రులుగా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఇప్పటికే వివిధ ఆశ్రమాలలో ఉన్న అనాధలకు ఎంతో నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో వసతి, విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా అనాధ పిల్లల కోసం చేపట్టవలసిన చర్యలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమం ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్, ఆశ్రమం ఇంచార్జి సూపరింటెండెంట్ గౌతమి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ