తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో చేపడుతున్న పాదయాత్ర నేటి (మార్చి 25, శుక్రవారం) నుంచి పున:ప్రారంభం అయింది. శుక్రవారం ముందుగా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి దేవాలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచే తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను భట్టి విక్రమార్క తిరిగి ప్రారంభించారు. అమ్మపేట, వల్లాపురం, నామవారం బ్రిడ్జ్, నామవారం మత్కేపల్లి, జగన్నాథపురం గ్రామాల మీదుగా నేడు భట్టి పాదయాత్ర సాగింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ కు పలువురు టీడీపీ, సీపీఐ నేతలు కూడా సంఘీభావం తెలిపారు.
ముందుగా మధిర నియోజకవర్గంలో ముదిగొండ మండలం యడవల్లి నుంచి ఫిబ్రవరి 27న పీపుల్స్ మార్చ్ ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. మార్చి 5 కల్లా గంధసిరి గ్రామం వరకు 102 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగగా, మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడంతో ఈ పాదయాత్రకు విరామం ఇచ్చి, తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే తన పాదయాత్రను భట్టి విక్రమార్క తిరిగి నేడు ప్రారంభించారు. ముదిగొండ అనంతరం చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భట్టి పాదయాత్ర నిరవధికంగా కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ