తెలంగాణలో ప్రజలు ఎలాంటి డిమాండ్లు, ధర్నాలు చేయకుండానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా అద్భుతమైన చైతన్యం ఉన్న జిల్లా అని, ఇక్కడి ప్రజలు విప్లవ భావాలతో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటారని ప్రశంసించారు. ఇక నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో తనను అరెస్టు చేసి జైల్లో పెడితే, కడుపులో పెట్టుకుని కాపాడుకున్నది ఖమ్మం ప్రజలేనని 2009నాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఈ రోజు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పరిపాలన భవనాన్ని కూడా నిర్మించుకుని నూతన కలెక్టరేట్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేపట్టిన సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని, దీంతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఇక ఢోకా ఉండదని, ఈ ప్రాజెక్టుతో యావత్ ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. ఎంతమంది అడ్డం పడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని, అలాగే సీతమ్మ ఆనకట్ట నిర్మిస్తున్నామని, దీనిలో 37 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని కేసీఆర్ తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వీటి అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలు ఉండగా.. వీటిలో పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో జనాభా అధికంగా ఉన్నారని తెలిపారు. దీంతో ఈ రెండు మున్సిపాలిటీలకు రూ. 40 కోట్ల చొప్పున, మిగిలిన రెండింటికి రూ. 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. కొత్తగూడెంకు మెడికల్ కాలేజీ ఇచ్చామని, సింగరేణిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE