రాష్ట్రంలో జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై కూడా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దళిత్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేయాలి:
శరీరంలోని ఒక భాగం పాడైతే.. ఆ శరీరానికి ఎంత బాధ ఉంటుందో, సమాజంలో ఒక భాగం వివక్షకు గురైతే, సమాజానికి కూడా అంతే బాధగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను దళితుల పేరుతో బాధ పెట్టే వ్యవహారం మంచిది కాదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించిన నాడే దళిత సాధికారత సాధ్యం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. అందులో భాగంగా దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదనీ, జూన్ 27వ తేదీ ఆదివారం నిర్వహించే సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఉన్నతాధికారులకు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు.
8 లక్షల దళిత బీపీఎల్ కుటుంబాల అభివృద్దే లక్ష్యం, ఈ ఏడాది రూ.1000 కోట్లు ఖర్చు:
ఈ పథకంలో భాగంగా దాదాపు అర్హులైన 8 లక్షల దళిత బీపీఎల్ కుటుంబాలను దశలవారీగా అభివృద్ధి పరిచడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామనన్నారు. ఇందుకుగాను రూ.1,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. దళిత సాధికారత పథకానికి, ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధం లేదని, దీనికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. దళితుల్లో నెలకొన్న వెనుకబాటుతనాన్ని, బాధలను తొలగించే క్రమంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకం కాబోతున్నదని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి ఏటా కొంతమంది లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, రైతుబంధు, వృద్యాప్య పించన్లు అందుతున్న పద్ధతుల్లోనే పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమయ్యేటట్లుగా చూడాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ