తెలంగాణలో ఎన్నికలకు 3 నెలలు ముందు మేనిఫెస్టో, 6 నెలలు ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేడ్చల్ లోని కీసరలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘చింతన్ శిబిర్’ విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్ కార్యక్రమం విజయవంతమైనదని, 6 ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరిగిందని ప్రకటించారు. అలాగే ఈ సదస్సులో 6 ప్రత్యేక బృందాలలోని సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఒక నివేదిక రూపొందిస్తామని వెల్లడించారు. ఏఐసీసీ మాజీ చీఫ్, పార్లమెంట్ సభ్యుడు రాహుల్గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్ తన రోడ్మ్యాప్ను రూపొందిస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రజలలోకి తీసుకెళ్లడంతో పాటు, అలాగే రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలన్నది పార్టీ నిర్ణయమని భట్టి పేర్కొన్నారు. వరంగల్ సభ స్పూర్తితో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని, మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాల లేమితో జీవనం సాగిస్తున్న గిరిజనుల కోసం అండగా నిలవాలని తీర్మానం చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఉచితంగా విద్యను, వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. ఉపాధి హామీ పనులను 250 పనిదినాలు పెంచుతామని, దీనిని వ్యవసాయానికి అనుసంధానిస్తామని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ అందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇకపై దూకుడుగా ముందుకు వెళ్లనుందని, ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగడతామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF