తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్ట్స్ విభాగంలో “పద్మ శ్రీ” పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దర్శనం మొగిలయ్య శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం శాలువాతో సత్కరించారు. అనంతరం పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ