గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్లో పర్యటించినపుడు ఇరు దేశాలు కుదుర్చుకున్న సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో ఈ స్పైవేర్ కూడా ఓ భాగమని తెలిపింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంది.
పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల, రాజకీయ నేతలు, ఇతర అధికారులపై ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. తాజాగా ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్వెపన్ కోసం యుద్ధం’’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎస్ఓ తన సాఫ్ట్వేర్ను పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి విక్రయిస్తోందని తెలిపింది.
ఎన్ఎస్ఓ.. ఇతర ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ నిఘా సంస్థలకు సాధ్యం కానంతటి సమర్థవంతంగా తమ స్పైవేర్ పని చేస్తుందనే హామీతో ఈ సాఫ్ట్వేర్ను అమ్ముతోంది. తమ సాఫ్ట్వేర్కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని ఎన్ఎస్ఓ వాగ్దానం చేసిందని నివేదికలో పేర్కొంది. జులై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇజ్రాయేల్ పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని తెలియజేసింది. ఈ డీల్లోనే పెగాసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కేంద్రాన్ని పీటీఐ సంప్రదించగా స్పందించడానికి నిరాకరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ