తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్విగ్విజయంగా అమలు అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 30 రోజుల కార్యాచరణను విజయవంతం చేసినందుకు మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేసారు. అదే విధంగా రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా నిలపాలని చెప్పారు. ప్లాస్టిక్ పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఇకపై ప్లాస్టిక్ వినియోగిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధంపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో చర్చించి, ప్లాస్టిక్ నిషేధంపై ఉత్తర్వులు జారీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు. ఇటీవలే మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రజలందరూ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
[subscribe]