ఇప్పటి వరకు ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో, తన వినియోగదారులకు ఏ నెట్వర్క్ లకైనా ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించారు. అయితే అక్టోబర్ 9, బుధవారం నాడు రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. ఇక పై ఇతర నెట్వర్క్లకు చేసే వాయిస్ కాల్స్పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాయిస్ కాల్స్ నిమిత్తం వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటా బ్యాలన్స్ ను తిరిగి అందిస్తామని జియో సంస్థ తెలిపింది. జియో సొంత నెట్వర్క్ కాల్స్కు, ఇతర నెట్వర్క్ ల నుండి వచ్చే ఇన్కమింగ్ కాల్స్కు, ల్యాండ్ లైన్స్ విషయంలో ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని చెప్పారు. ట్రాయ్ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఐయూసీ ఛార్జీల వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 10 తర్వాత రీఛార్జి చేసుకునే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
జియో నెట్వర్క్పై ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తున్న కూడ, ఐయూసీ ఛార్జీల కింద పోటీ సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు గత మూడు సంవత్సరాలనుంచి రూ.13,500 కోట్ల చెల్లింపులు జరపాల్సి వచ్చిందని జియో సంస్థ తెలిపింది. అయితే, ఐయూసీ ఛార్జీలను ట్రాయ్ పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని తెలిపారు. ఐయూసీ టాప్ అప్ ఓచర్ రూ.10 తో రీఛార్జ్ చేసుకుంటే, నాన్-జియో మొబైల్స్ కి 124 నిమిషాలపాటు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఉచితంగా 1జీబీ డేటా బ్యాలన్స్ పొందుతారు. రూ.10, రూ.20, రూ.50,రూ.100 లతో ఐయూసీ టాప్ అప్ ఓచర్లను జియో ప్రవేశపెట్టింది.