తెలంగాణ పథకాలు మక్కీకి మక్కీ అమలుచేస్తే చాలు, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించవచ్చని పేర్కొన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నాందేడ్ మరియు కంథార్ లోహా తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మూడవ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔరంగాబాద్ సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం అని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశానికి సమగ్ర నీటి విధానం తీసుకొస్తామని, మహారాష్ట్రను ఐదేండ్లలో సస్యశ్యామలం చేస్తామని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానం ప్రైవేటీకరణ అని ఆరోపించిన ఆయన, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను జాతీయం చేస్తుందని స్పష్టం చేశారు.
కాగా మహారాష్ట్రలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, తమ పార్టీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలోని ఇంటింటికీ పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తనను ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, రైతుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడికైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తాను ఇక్కడికి రాకూడదని బీజేపీ నేతలు కోరుకున్నట్లయితే, దళిత బంధు పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అప్పుడు తాను ఇక్కడకు రాను అని తేల్చి చెప్పారు. దేశంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ, అనేక రాష్ట్రాలు తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయని గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. ఔరంగాబాద్కు ఎనిమిది రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు అందుతుందని స్థానిక నాయకులు తనతో చెప్పారని, ప్రక్కనున్న అకోలాలో కూడా అదే పరిస్థితి ఉందని తన దృష్టికి వచ్చిందని, ఈ పరిస్థితి మారాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.
అందుబాటులో ఉన్న వనరులతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించవచ్చని, ప్రతి ఒక్కరికీ అద్భుత ఉపాథి అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు. పొరుగున ఉన్న చైనా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో నిలుస్తోందని, మనకన్నా చిన్న దేశాలైన కొరియా మరియు జపాన్ అభివృద్ధిలో చెందుతున్నాయని, ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని మలేషియా, సింగపూర్లు రాణిస్తున్నాయని, ఇకనైనా మనం వీటిపై ఆలోచన చేయాలని, మనందరి భవిష్యత్ కోసం పోరాడాలని, తద్వారా భారతదేశ తలరాతను మార్చాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో పరివర్తన్ రావాల్సిన అవసరం ఏర్పడిందని, దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ స్థాపించబడిందని, ఆ మార్పును తీసుకురావడానికి తమ పోరాటం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏ మతం లేదా ఏ సమూహం కోసం బీఆర్ఎస్ పనిచేయదని, తాము భారతీయులందరి కోసం పని చేస్తున్నామని, అయితే కొన్ని శక్తులు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నాయని, అయినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
అంబేడ్కర్ పుట్టిన గడ్డపై దళితబంధు ఎందుకివ్వరు? కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి. ఇంకెన్నాళ్లు రైతులు ఇలా ఓటర్లుగానే ఉంటారు? రైతులు నాయకులు కావాలి, రైతులే చట్టసభల్లోకి అడుగుపెట్టాలి, తమ శాసనాలను తామే రచించుకోవాలి. తలాటీ (వీఆర్వో) వ్యవస్థను తెలంగాణలో వలే రద్దు చేసి ధరణి వంటి పోర్టల్ ద్వారా డిజిటలైజ్డ్ విధానం అమలు చేసి రైతులకు న్యాయం చేయండి. రైతు బంధు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నాం. రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా కింద మరణించిన 8 రోజుల్లోనే వారి ఖాతాల్లో రూ.5 లక్షలు జమ చేస్తున్నాం. నాందేడ్లో బీఆర్ఎస్ సభ పెట్టిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రతీ రైతుకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇది మనం సాధించిన తొలి విజయం. ఇక్కడి రైతులందరికీ తెలంగాణ మాడల్లో పథకాలను అమలు చేయాలి. ఇవన్నీ చేస్తే కేసీఆర్ ఇక్కడకు రావాల్సిన పనే లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ