సోమవారం మధ్యాహ్నం జరిగిన పరిణామాల నేపథ్యంలో.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల (వచ్చే నెల 8వ తేదీ వరకు) రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గాంధీలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులను కలిసేందుకు వెళ్ళడానికి సిద్దమైన షర్మిలను లోటస్ పాండ్ వద్ద నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వారితో వాగ్యుద్ధానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైఎస్ షర్మిల.. ఓ ఎస్సై స్థాయి అధికారిపై చేయిచేసుకోగా, మరో మహిళా కానిస్టేబుల్ను చేత్తో నెట్టేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడటంతో చివరకు షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ జోన్) జోయెల్ డేవిస్ ప్రకారం, వైఎస్ షర్మిల సిట్ అధికారులను కలిసేందుకు ముందస్తు అనుమతి కోరలేదని, అయితే ఆమె సిట్ కార్యాలయానికి వెళుతున్నట్లు తమకు సమాచారం అందడంతో అధికారులు ఆమె నివాసానికి వెళ్లారని ఆయన చెప్పారు. షర్మిలను అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అధికారులు అక్కడికి వెళ్లారని, ఈ సందర్భంగా ఆమె పోలీసు అధికారులపై దాడి చేశారని తెలిపారు. ఒక పోలీసును నెట్టివేసి, మహిళా కానిస్టేబుల్ను కూడా కొట్టారని, అందుకే ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా 332, 353, 407, 509 సెక్షన్ల కింద కేసుల నమోదు చేశామని వెల్లడించారు. అయితే దీనిపై షర్మిల స్పందిస్తూ.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై రిప్రజెంటేషన సమర్పించేందుకు సిట్ కార్యాలయానికి వెళ్లడం తప్పెలా అవుతుందని? అకారణంగా పోలీసులు తనను గృహనిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆత్మరక్షణ కోసం తాను ప్రతిస్పందించానని తెలిపారు.
ఇక ఇదిలా ఉండగా.. షర్మిల అరెస్ట్ అయిన విషయం తెలియగానే ఆమె తల్లి వైఎస్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే, పోలీసులు ఆమెను స్టేషన్లోకి అనుమతించకపోవడంతో పాలీసులపై అసహనం వ్యక్తం చేశారు. కొద్ది సేపు వాగ్వాదం అనంతరం విజయలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ సందర్భంగా వైఎస్ విజయలక్ష్మ్డి కూడా విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్న దానిపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒక మహిళ అన్న కనీస గౌరవం లేకుండా అంతమంది పోలీసులు మీద పడుతుంటే షర్మిలకు ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. తనపై కూడా పది మంది మహిళా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ కార్లో ఎక్కించబోతుంటే తనకు కూడా ఆవేశం వచ్చిందిని, తాను నిజంగా వారిని కొట్టాలంటే గట్టిగానే కొట్టేదాన్నే కదా? అని నిలదీశారు. మరోవైపు అరెస్టయిన షర్మిలను ఆమె భర్త అనిల్ కుమార్ పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ