తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం: సీఎం కేసీఆర్

CM KCR Held Telangana Dalit Bandhu Scheme Awareness Seminar Today at Pragati Bhavan

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు ప్రగతి భవన్ లో ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా డా.బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం అని అన్నారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి వుంటది, అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయం సాధించి పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ వుంటాయి. తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణం మనం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమవుతుందని చెప్పారు.

“డా.బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించింది. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితి మీద నేను అధ్యయనం చేశాను. సెంటర్ ఫర్ సుబాల్టర్న్ స్టడీ ద్వారా అధ్యయనం చేశాను. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలి. కక్ష కార్పణ్యాలు ద్వేషాలు పోవాలె. నేటి సదస్సులో పాల్గొన్నవారు హుజూరాబాద్ లో విజయం సాధించి ముందు రోజుల్లో, తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలి. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుంది. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరాని తనం పేరుతో ఊరవతల వుంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం తెలివి తక్కువ పని, ఇది దుర్మార్గం. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. సర్కారే స్వయంగా అండగా వున్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి” అని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఆర్థికాభివృద్ధి వుండే ఇతర రంగాలను గుర్తించి వాటిలో రిజర్వేషన్ లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. “పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు వంటి వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్, కోళ్ళ పెంపకం, టెంట్ హౌజ్, డైరీ పరిశ్రమ, ఆయిల్, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల ఇండస్ట్రీ, హోటల్, స్టీల్ సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫోటో గ్రఫి, వీడియో గ్రఫీ, సెల్ ఫోన్ షాప్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్, వంటి పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి, దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా, ప్రభుత్వ లబ్ధిదారుని భాగస్వామ్యంతో, శాశ్వత ప్రాతిపదికన ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేస్తుంది. ‘దళిత రక్షణ నిధి’ ని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీతో నిర్వహించబడుతుంది. ఎవరైతే అవకాశం లేక, సహకారం లేక బాధపడుతున్నారో అటువంటి వర్గాలన్నింటికి దళిత బంధు దారులు వేస్తుంది. మీ విజయం ఇతర కులాలకు, వర్గాలకు, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశానికే వెలుతురు ప్రసరింపచేస్తుంది. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు కరదీపికలుగా మారాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + one =