రాష్ట్రంలో హెల్త్ కేర్ ఇన్ఫ్రా అభివృద్ధిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ లో రూ.17 కోట్లతో ఏర్పాటు చేసిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, మెదక్ లో100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఈ ఆసుపత్రి మొత్తం కాన్పుల కోసమేనని అన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో చొరవ చూపడంతో, సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుందని చెప్పారు. ఇందులో మెటర్నిటీ వార్డ్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం, పిడియాట్రిక్ వార్డ్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఆంటి నాటల్ వార్డ్, పోస్ట్ నాటల్ వార్డ్ వంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం ఇంకా పెరిగేందుకు ఆశా వర్కర్స్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో 27వేల మంది ఆశాల ఉండగా, 700 మంది పరిధిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళుతున్నారని, ఈ విషయంపై వారితో సమీక్ష నిర్వహించామని చెప్పారు. ఆశాల పరిధిలో ప్రైవేటుకు వెళ్లే కేసులు ఎక్కువైతే చర్యలు ఉంటాయన్నారు. మంచి చేస్తే హైదరాబాద్ కు పిలిచి సన్మానం చేశామని, కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని అన్నారు.
ప్రతి నెల మూడో తేదీన ఆశాలతో టెలి కాన్ఫరెన్స్ ఉంటుందని, అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో దళిత బంధును ఒక ఉద్యమంగా నిర్వహిస్తామని చెప్పారు. దళితులను నిలబెట్టేందుకు ఇది పెద్ద కార్యక్రమమని, మెదక్ లో వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF