తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ డా.ఎస్ సంగీత సత్యనారాయణను కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సర్వమత పార్ధనలు కూడా నిర్వహించారు. మొత్తం 22 ఎకరాల్లో రూ.48 కోట్ల వ్యయంతో పెద్దపల్లి శివారులోని ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో ఆరు బ్లాకులు, 98 గదులతో ఈ సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధు, ఎమ్మెల్సీలు, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ పర్యటనలో ముందుగా మంథని రోడ్డులోని గౌరెడ్డిపేట శివారులో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు ప్రాంగణంలో సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ ఆఫీసు లోపల సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ను సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్షుడు సీట్లో బెట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా హెలికాప్టర్ లో పెద్దపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు కలెక్టరేట్ సమీపంలోని పెద్దకల్వలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY