కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మే 4వ తేదీనుంచి గ్రీన్ జోన్స్ లలో అన్ని సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తూ, ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో గణనీయమైన మినహాయింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెడ్ జోన్స్ లో మాత్రం కట్టుదిట్టంగా లాక్డౌన్ ను అమలు చేయాలనీ ఆదేశాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించగా, తాజా కేంద్ర ఆదేశాల ప్రకారం ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో సడలింపులు ఇస్తారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో ప్రజా రవాణతో పాటుగా మద్యం అమ్మకాలపై నిర్ణయాలు వెలువరించాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ప్రకటించిన సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశమునట్టు తెలుస్తుంది.
మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మే 5, మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ గడువు మే 7 తేదీతో ముగియనుండడంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్ తో సహా ఇతర అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu