తెలంగాణ రాష్ట్ర సరికొత్త అర్బన్ పాలసీ రూపకల్పన పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన, పారదర్శకముగా సేవలందించడానికి కొత్తగా రెవిన్యూ, అర్బన్,రూరల్ పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నూతన అర్బన్ పాలసీ లో భాగంగా నూతన మునిసిపల్ చట్టం, నూతన కార్పొరేషన్, మరియు హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని, హెఎండబ్ల్యూఏ పాటు, ఇతర నగరాల్లో ఉన్న అభివృద్ధి సంస్థల లో మార్పులకు నూతన చట్టాలు తయారు చేయాలనీ అధికారులను కోరారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశం లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి, మున్సిపల్ శాఖ అధికారులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం గురించి మాట్లాడుతూ, తెలంగాణ లోని అన్ని పల్లెల్లో అన్ని విధాలుగా మార్పు సాధించే విధంగా, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు పూనుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం పై అవగాహన కల్పించడానికి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.