రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేయబడిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పున ఇప్పటి వరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా సీఎంకు నివేదిక అందిచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే దళితబంధు కోసం నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో జాప్యం జరగరాదు’’ అని సీఎం స్పష్టం చేశారు.
దళితబంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలలనుంచి ప్రశంసలు:
దళితబంధు పథకాన్ని మరింత ప్రభావవంతంగా వేగవంతంగా అమలు చేసేందుకు గాను త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ‘‘దళితబంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. ఈ పథకం అమలు ద్వారా మనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఫలితాలు అందుతాయి. దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతాయి. సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుంది. దళితబంధు పెట్టుబడి ద్వారా జరిగే వ్యాపార వాణిజ్యాలు తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జిఎస్డిపీని పెంచడంలో దోహదపడుతుంది’’ అని సీఎం అన్నారు. ఇప్పటికే దళితబంధు ద్వారా అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం అని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు:
‘‘ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. తద్వారా దళిత యువతలో వున్న నిరాశానిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంది. వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. దవాఖానాలు ఫెర్టిలైజర్ షాపుల వంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ పునరుధ్ఘాటించారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్, వి.శేషాద్రి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అడిషనల్ డైరక్టర్ కె.విజయ కుమార్, జాయింట్ డైరక్టర్ కె.రాములు, అసిస్టెంట్ డైరక్టర్ మాధవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ