తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే ఈ మహాధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేసేదాకా పోరాడుదామని, రైతన్నలకు అండగా నిలుస్తామని నాయకులు ప్లకార్డ్స్ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల విముఖతతో ఉందన్నారు. వడ్లు కొనుగోలు, వ్యవసాయ చట్టాల విరమణ, కరెంటు మీటర్లు పెట్టే విధానంపై వైఖరి మార్చుకోవాలని పలుమార్లు చెప్పామని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ యుద్దానికి శ్రీకారం చుట్టామని, ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదన్నారు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు పరిరక్షించబడాలని, ఉత్తర భారతదేశంలోని రైతులను కలుపుకొని కూడా ఈ ఉద్యమాన్ని భవిష్యత్లో మరింత ఉధృతం చేయాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీకి లేఖ రాశానని, కానీ ఎలాంటి ఉలుకు పలుకు లేదన్నారు. ఈ నేపథ్యంలోనే మన బాధను ప్రపంచానికి, దేశానికి తెలియజెప్పేందుకే ఈ మహాధర్నాకు శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలో రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ